రూల్ 168 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:
సెప్టెంబర్ 9, 2026న తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నకిలీ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలోని పోస్టును ఆధారంగా చేసుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేశారని, పవిత్రమైన శాసనసభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ శాసనసభ నియమావళి రూల్ 168 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు.ఈ మేరకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిసి అసెంబ్లీ సెక్రటరీ శ్రీ రెడ్ల తిరుపతి గారికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అందజేశారు.చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ‘బీఆర్ఎస్ అంతర్జాతీయ కార్యదర్శి సంధ్యారావు’ పేరిట ఉన్నట్లు పేర్కొన్న నకిలీ ఎక్స్ ఖాతాలోని పోస్టును శాసనసభలో చదివి వినిపించారని వారు తెలిపారు. బీఆర్ఎస్లో లేని ‘అంతర్జాతీయ కార్యదర్శి’ పదవిని సృష్టించి, ఆ పేరుతో రూపొందించిన నకిలీ సోషల్ మీడియా ఖాతాలోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో ప్రస్తావించడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు.పవిత్రమైన చట్టసభలో అవాస్తవ, నిరాధార మరియు వాస్తవ విరుద్ధమైన సమాచారాన్ని ప్రదర్శించడం ద్వారా సభా గౌరవానికి భంగం కలిగించడంతో పాటు, సభ్యులను తప్పుదోవ పట్టించే పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు.అందువల్ల నకిలీ ఎక్స్ ఖాతాలోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని శాసనసభలో వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిపై రూల్ 168 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అందజేశామని తెలిపారు.ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని వారు కోరారు.
