ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక
అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు చెన్నారెడ్డి
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి 63వ జన్మదిన వేడుకలు నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే జిఎంఆర్పై తమకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకునేందుకు పలువురు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని ప్రఖ్యాత పూరి సముద్ర తీరంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేరుతో ప్రత్యేకంగా సైకత శిల్పాన్ని రూపొందించారు. పటాన్ చెరు నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సైకత శిల్పాన్ని తయారు చేయించారు.ఇసుకతో అత్యంత ఆకర్షణీయంగా రూపొందించిన ఈ శిల్పం పూరి బీచ్కు వచ్చిన సందర్శకులను సైతం ఆకట్టుకుంది. ఎమ్మెల్యే జిఎంఆర్ 63వ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు తమ అభిమానాన్ని ఇలా వినూత్నంగా వ్యక్తం చేయడం ప్రత్యేకంగా నిలిచింది.ప్రస్తుతం పూరి పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్వయంగా బీచ్కు చేరుకొని సైకత శిల్పాన్ని వీక్షించారు. తనపై అభిమానంతో ప్రత్యేకంగా సైకత శిల్పాన్ని రూపొందించిన చెన్నారెడ్డిని అభినందించారు. అభిమానులు, కార్యకర్తలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ కృతజ్ఞతలు తెలిపారు.తన జన్మదినాన్ని పురస్కరించుకొని పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు, పేదలకు సహాయ కార్యక్రమాలు, ఇతర సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా వేడుకలు నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.పుట్టినరోజు వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ప్రజా సేవకు అంకితం చేయడం అభినందనీయమని పేర్కొంటూ, తనపై అభిమానంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పటాన్ చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదినం సందర్భంగా పూరి బీచ్లో రూపుదిద్దుకున్న ఈ సైకత శిల్పం అభిమానానికి, ఆప్యాయతకు వినూత్న ప్రతీకగా నిలిచింది.
