మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అర్హులైన ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడానికి, కొత్త ఓటర్ల నమోదును ప్రోత్సహించడానికి, తప్పులను సరిదిద్దడానికి అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీయమని తెల్లాపూర్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ రాములు గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని ముత్తంగి డివిజన్ పరిధిలోని వెలిమల గ్రామంలో తాజా మాజీ కౌన్సిలర్లు సుచరిత,కొమరయ్య, పట్లోళ్ళ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని సర్ పత్రాలు నింపడంలో అనుమానాలు ఉంటే హెల్ప్ డెస్క్ లను సంప్రదించాలని కోరారు. ఇప్పటికే వెలిమల గ్రామంలో 80 శాతం ఓటర్ల సర్వే ప్రక్రియ పూర్తయిందని తెల్లాపూర్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ రాములు గౌడ్ తెలిపారు. అనంతరం ఇరువురు గ్రామ ప్రజలతో కలిసి సేకరించిన సమాచారాన్ని, సవరించిన ఓటర్ జాబితాలను బిఎల్ఓలకు అందించారు. వెలిమల గ్రామంలో సుమారు 3,000 ఓట్లు ఉండగా, ప్రజాప్రతినిధులు , అధికారులు సమన్వయంతో పనిచేసి ఇప్పటికే 80 శాతం ఓటర్ అవగాహన, సర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామన్నారు . మిగిలిన ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు .ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతీ ఒక్కరూ తమ ఓటును సరిచూసుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో మంగలి దయాకర్, మున్నూరు రవి,ఎస్. ప్రభాకర్ రెడ్డి,కే. నవీన్,స్థానిక నాయకులు, బిఎల్ఓలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
