జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి:

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ​సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామంలోని సర్వే నెం. 1 కి సంబంధించిన 150 ఎకరాల భూ బాధితులైన రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇవాళ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతిక్ జైన్ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి రైతులు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో ఈ భూమిని హెచ్ఎండిఏ కి కేటాయించినప్పటికీ, నేటి వరకు రైతులకు ఎలాంటి ప్లాట్లు లేదా సరిహద్దులు కేటాయించకపోవడం వల్ల రైతులు తీవ్ర అ భద్రతాభావాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. సర్వే నంబర్ 1 ని ధరణి పోర్టల్ నుండి తొలగించడం వల్ల గత నాలుగేళ్లుగా రైతుబంధు, రైతుబీమా వంటి కీలకమైన ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందక రైతులు అకారణంగా నష్టపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా ఈ భూమిని టీజీఐఐసి కి బదిలీ చేయాలని, అలాగే గుమ్మడిదల తరహాలో ఎకరానికి రూ. 60 లక్షల నష్టపరిహారంతో పాటు 100 చదరపు గజాల ఇంటి ప్లాట్‌ను అర్హులైన రైతులందరికీ అందించేలా ప్రభుత్వానికి తక్షణమే సానుకూల నివేదిక పంపాలని కలెక్టర్‌ను కోరారు. రైతుల పక్షాన నిలబడి వారికి సంపూర్ణ న్యాయం జరిగే వరకు అవసరమైన అన్ని స్థాయిల్లోనూ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రతాపరెడ్డి, నాయకులు రాజేందర్ రెడ్డి, బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *