పికిల్ బాల్ ప్రపంచ కప్ 2026లో రెండు పతకాలు సాధించిన
బీబీఏ తొలి ఏడాది విద్యార్థి ఆశ్రిత
వియత్నాంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పికిల్ బాల్ ప్రపంచ కప్ 2026 పోటీలలో, హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, బీబీఏ తొలి ఏడాది విద్యార్థిని ఆశ్రిత రాజు దాట్ల రెండు పతకాలు సాధించి సంస్థకు గర్వకారణంగా నిలిచారు. 18 ఏళ్ల లోపు విభాగంలో పోటీపడిన ఆశ్రిత, అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, బాలికల సింగిల్స్ లో రజత పతకాన్ని, డబుల్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఒక అంతర్జాతీయ క్రీడా పోటీలలో సింగిల్స్, డబుల్స్.. రెండింటిలోనూ పతకాలు సాధించడం ఒక గొప్ప ఘనత. ఇది ప్రపంచ వేదికపై రాణించాలనే ఆమె ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదల, సంకల్పానికి నిదర్శనం.
ఆశ్రిత సాధించిన ఈ విజయం ఆమె కఠోర శ్రమ, నిబద్ధత, పికిల్ బాల్ పట్ల ఉన్న అభిరుచికి నిదర్శనం. ఆమె విజయం, చదువుకు అతీతంగా రాణించడం, సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రాముఖ్యతను కూడా చాటి చెబుతోంది. ఒక అంతర్జాతీయ క్రీడా కార్యక్రమంలో గీతంకు ప్రాతినిధ్యం వహించడం ద్వారా, ఇతర రంగాలలో రాణించాలని ఆకాక్షించే తోటి విద్యార్థులకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు.గీతం నాయకత్వం, ఆశ్రిత సాధించిన ఈ అద్భుత విజయానికి అభినందించి, ఆమె అంకితభావం, క్రీడా స్ఫూర్తి, శ్రేష్ఠత పట్ల నిబద్ధతను ప్రశంసించింది. ఆమె మరిన్ని విజయాలను సాధించి, మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ప్రోత్సహించారు.
వియత్నాంలో తన అద్భుతమైన ప్రదర్శనతో, ఆశ్రిత వర్ధమాన యువ క్రీడాకారులకు ఒక గొప్ప ప్రమాణాన్ని నెలకొల్పింది. అంకితభావం, పట్టుదల, నిరంత కృషితో ఆశయాలను అంతర్జాతీయ వేదికపై విజయాలుగా మార్చుకోవచ్చని ఆమె ప్రస్థానం నిరూపిస్తోంది.
