అధ్యాపకుల పర్యవేక్షణలో గణిత, విజ్జాన శాస్త్రాల బోధన
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం ముత్తంగిలోని MJPTBCWRJC, Sangareddy, and SOE Girls కళాశాలలోని ఇంటర్మీడియెట్ విద్యార్థుల కోసం గణిత, విజ్జాన శాస్త్ర అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్ డ్, ఈఏపీసెట్ పరీక్షలకు సమర్థవంతమైన సన్నద్ధత వ్యూహాలను విద్యార్థులకు అందించడంతో పాటు, ఇంజనీరింగ్, గణితం, విజ్జాన శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.అధ్యాపక బృందం, విద్యార్థి వాలంటీర్లు కలిసి పరీక్షా సంబంధిత భావనలు, సమయాన్ని ఆదా చేసే గణితంలో సులువైన మార్గాలు (షార్ట్ కట్లు), శాస్త్రీయ సమస్య పరిష్కార పద్ధతులు, వృత్తి మార్గదర్శనంపై ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.నేర్చుకున్న భావనలను మరింత పటిష్టం చేయడానికి ఒక ఆసక్తికరమైన క్విజ్ పోటీని నిర్వహించారు. ఇందులో విజేతలకు గీతం లోగోతో కూడిన వాటర్ బాటిళ్లు, పెన్నులను బహుమతిగా అందజేశారు.పోటీ పరీక్షల కోసం తమ ఆత్మవిశ్వాసాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంచిన ఆచరణాత్మక చిట్కాలను, సులువైన పద్ధతులను విద్యార్థులు ఎంతగానో ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.అధ్యాపక సమన్వయకర్తలు డాక్టర్ పి.నరసింహస్వామి, డాక్టర్ శివారెడ్డి శేరి, డాక్టర్ పి.జితేంద్ర సేనాపతి, డాక్టర్ ఎస్.చక్రవర్తిల పర్యవేక్షణలో, విద్యార్థులు త్రిషల్ సాయి వల్లేపల్లి, చింతలకుంట నితిన్ కుమార్, సుభాంగి పాండా, అనుష్క ప్రజాపతి, పిర్లమర్ల లక్ష్మీ వజ్ర, తలమంచి మనోజ్ కుమార్ ఈ ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
