సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ సంక్షేమ సంఘం కోసం వెయ్యి గజాల స్థలం భవన నిర్మాణం

politics Telangana

అర్హులైన సెంట్రింగ్ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

ప్రతి కార్మికుడికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా చర్యలు

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగానికి కీలకంగా మారిన సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అతి త్వరలో వెయ్యి గజాల స్థలం కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో నియోజకవర్గస్థాయి సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు కార్మికుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనులు చేయాలని కోరారు. సంఘం సభ్యుల కోరిక మేరకు అతి త్వరలో వెయ్యి గజాల స్థలంతో పాటు భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు. కార్మిక శాఖ అధికారులతో చర్చించి ప్రతి కార్మికుడికి ఆరోగ్య భద్రతను అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి సెంట్రింగ్ కార్మికుడికి స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు లేనివారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, నర్రా బిక్షపతి, శ్రీధర్ చారి, పృథ్వీరాజ్, రాజు, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు యాదగిరి, అధ్యక్షులు కృష్ణ, ప్రధాన కార్యదర్శి జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *