మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థి శ్రీధరాల వి. నూకరాజును డాక్టరేట్ వరించింది. ‘దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం, వాహకం ద్వారా పనిచేసే వినూత్నమైన స్థానిక (టాపికల్) టెరిఫ్లునోమైడ్ ఔషధ రూపాల అభివృద్ధి’ అనే శీర్షికతో ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ అధ్యాపకుడు డాక్టర్ పవన్ కుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ నూకరాజు పరిశోధన, దైహిక దుష్ప్రభావాలను కనిష్ట స్థాయికి తగ్గిస్తూ, ఔషధాన్ని నేరుగా ప్రభావిత ప్రాంతానికి చేరవేసే లక్ష్యంతో, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అటోపిక్ డెర్మటైటిస్ చికిత్స కోసం టెరిఫ్లునోమైడ్ యొక్క వినూత్న స్థానిక ఫార్ములేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిందని తెలియజేశారు.ఈ అధ్యయనం, ఆశాజనకమైన చికిత్సా పనితీరుతో, సురక్షితమైన, లక్షిత, రోగికి అనుకూలమైన చికిత్సా పద్ధతులను అందిస్తూ, వ్యాధి-నిర్దిష్ట స్థానిక ఫార్ములేషన్లను విజయవంతంగా అభివృద్ధి చేసిందన్నారు. ఈ పరిశోధన భవిష్యత్ క్లినికల్ అభివృద్ధి, వాణిజ్యీకరణకు బలమైన సామర్థ్యాన్ని కూడా ప్రదర్శిస్తోందని, తద్వారా స్థానిక ఔషధ పంపిణీ పరిశోధనకు ఒక ముఖ్యమైన తోడ్పాటును అందిస్తుందని వివరించారు.డాక్టర్ నూకరాజు సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఫార్మసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి.శివకుమార్, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
