మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) అన్నారు.రాష్ట్రస్థాయి ఫోటోగ్రాఫర్ల క్రికెట్ పోటీల్లో పాల్గొననున్న పటాన్చెరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో కొనుగోలు చేసిన స్పోర్ట్స్ కిట్లను సోమవారం సాయంత్రం మైత్రి మైదానంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతను నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. క్రీడల ద్వారా ఆరోగ్యం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యం పెంపొందుతాయని పేర్కొన్నారు.ఫోటోగ్రాఫర్ల అభివృద్ధి, సంక్షేమం కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ కొనసాగుతాయని హామీ ఇచ్చారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పటాన్చెరు జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలవాలని ఆకాంక్షిస్తూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు కృష్ణ యాదవ్, మహిపాల్ రెడ్డి, రాజేష్, లక్ష్మారెడ్డి, పవన్, నాగేష్, అంజి, తదితరులు పాల్గొన్నారు.
