మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
భక్తుల జయ జయ ధ్వనాల మధ్య పటాన్చెరు పట్టణంలో పూరి జగన్నాథుడి రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయం వద్ద హరే రామ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన రథయాత్రను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై బంగారు చీపురుతో రథయాత్ర మార్గాన్ని ఊడ్చి రథాన్ని లాగి ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై జగన్నాథ, బలబద్ర, సుభద్రల విగ్రహాలను అందంగా అలంకరించారు. చిన్నారులు, మహిళలు, హరే రామ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ సభ్యులు కీర్తనలు పాడుతూ పట్టణ పుర వీధుల గుండా రథయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పూరిలో జరిగే జగన్నాథుడి రథయాత్ర ప్రపంచంలోనే అతి పురాతనమైన హిందూ ఆధ్యాత్మిక ఉత్సవమని అన్నారు. పటాన్చెరు పట్టణంలో జగన్నాథుడి రథయాత్రను ఏర్పాటు చేయడం పట్ల ఆయన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పటాన్చెరు నియోజకవర్గమని తెలిపారు. దేశంలోని 27 రాష్ట్రాల ప్రజలు నియోజకవర్గంలో నివసిస్తున్నారని తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బంగారుగడ్డ వద్ద మూడు ఎకరాల విస్తీర్ణంలో బాలాజీ దేవాలయం, శ్రీకృష్ణుని దేవాలయం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. భక్తులందరి సహాయ సహకారాలతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. భగవంతుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నర్ర బిక్షపతి, పృథ్వీరాజ్, అశోక్, నర్సింలు, చంద్ర శేఖర్, మల్లేష్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
