భవిష్యత్తును అంచనా వేస్తూ, సుస్థిరత సాధించండి

Telangana

ఆతిథ్య ఉపన్యాసంలో గీతం విద్యార్థులకు డాక్టర్ బొబ్బా ఉద్బోధ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

బ్యాటరీ అధునాతన సాంకేతికతలపై పట్టు సాధించాలని, మరీ ముఖ్యంగా ఇంటెలిజెంట్ బ్యాటరీ పరిజ్జానం ద్వారా వర్తమానాన్ని తెలుసుకుంటూ, భవిష్యత్తును అంచనా వేస్తూ, సుస్థిరమైన రేపటిని సాధ్యం చేసుకోవాలని స్మార్ట్ ఎకో ఎలక్ట్రిక్ డ్రైవ్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ ఫణీంద్రబాబు బొబ్బా సూచించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘బ్యాటరీ ఆరోగ్య పర్యవేక్షణ, పునర్ వినియోగంలో ఏఐ, ఎంఎల్ వినియోగం’ అనే అంశంపై బుధవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.డాక్టర్ బొబ్బా, బ్యాటరీ ఆరోగ్య పర్యవేక్షణ (బీహెచ్ఎం), ఆరోగ్య స్థితి (ఎస్ఓహెచ్), మిగిలిన ఉపయోగకర జీవితం (ఆర్.యూఎల్), ముందస్తు నిర్వహణ, బ్యాటరీ పునర్వినియోగం, మరోసారి వినియోగించడం వంటి వాటిపై దృష్టి సారిస్తూ, ఎలక్ట్రిక్ వాహనాలు, శక్తి-నిల్వ వ్యవస్థలలో కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) యొక్క పెరుగుతున్న పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు.వోల్టేజ్, కరెంట్, ఉష్ణోగ్రత, ఛార్జ్-డిశ్చార్జ్ సరళి వంటి బ్యాటరీ పారామితుల యొక్క ఏఐ/ఎంఎల్-ఆధారిత విశ్లేషణ, బ్యాటరీ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి, క్షీణత, వైఫల్యాలను ముందుగా ఊహించడానికి భద్రతను పెంచడానికి, బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగించడానికి ఎలా సహాయపడుతుందో డాక్టర్ బొబ్బా విరించారు. ఏఐ-ఆధారిత బ్యాటరీ గుర్తింపు, వర్గీకరణ, పదార్థాల పునరుద్ధరణ, పునర్ వినియోగం గురించి కూడా ఆయన చర్చించారు. వలయాకార, సుస్థిర బ్యాటరీ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో వాటి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. విద్యార్థులకు ఆచరణాత్మక అవగాహన కల్పించడానికి కేస్ స్టడీలతో పాటు ఆయన చేసిన పరిశోధన ప్రచురణలను కూడా చూపారు. విద్యార్థుల ప్రశ్నలకు బదులిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేశారు.ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ప్రశాంత ఆర్. ముడిమేల సమక్షంలో గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ వడ్డి, డాక్టర్ బొబ్బాను సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఈఈసీఈ విభాగానికి చెందిన డాక్టర్ జి. శ్రీనివాస్, డాక్టర్ పి.వి. రామకృష్ణ సమన్వయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *