పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక సెప్టెంబర్ 9 వ తేదిన శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి ని పురస్కరించుకుని నిర్వహించనున్న “తెలంగాణ భాషా దినోత్సవం” సందర్భంగా జరుగబోతున్న అంతర్జాతీయ కవి సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్రం శేరిలింగంపల్లికి చెందిన ప్రముఖ కవి, తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ కార్యదర్శి ,ఎస్ వీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోటూరి నారాయణరావు ప్రత్యేక ఆహ్వానితులుగా తానా సంస్థ వారు ఆహ్వానించారు.తానా వారు నిర్వహిస్తున్న ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించినందుకు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగ వరపు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రముఖ కవి
డాక్టర్ మోటూరి నారాయణరావు పలు కవితా సంపుటులు ముద్రించారు. పలురచనలు చేశారు.
తెలుగు వెలుగు సాహిత్య వేదిక సంస్థ లో ప్రధాన భూమిక పోషిస్తూ.. జాతీయ ప్రధాన కార్యదర్శి గా పనిచేస్తూ అనేకమంది ఔత్సాహిక , వర్ధమాన కవులను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే పటాన్ చెరు నియోజకవర్గంలో స్ధానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారి సహకారంతో వెయ్యి మంది కవులతో జాతీయ సాహిత్య సంబరాలను విజయవంతంగా నిర్వహించి సాహిత్య లోకాన్ని ఆకర్షించారు.
అంతర్జాలం లో తానా నిర్వహిస్తున్న ఈ భాషా దినోత్సవం కార్యక్రమం యప్ టీవీ ద్వారా అనేక యూరప్ దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవటమే కాకుండా, తానా అధికారిక యూట్యూబ్ ఫేస్బుక్ చానల్స్ లో, ఈటీవీ భారత్ వంటి దాదాపు పది యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డాక్టర్ మోటూరి నారాయణరావు కు అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల పలువురు పెద్దలు, రాజకీయ నాయకులు, మిత్రులు,కవి పండితులు హర్షం వ్యక్తం చేశారు.