గీతం విద్యార్థులకు పిలుపునిచ్చిన ఐఏఎఫ్ అధికారి దీపక్ భరద్వాజ్
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో అధికారులుగా లేదా అగ్నివీరులుగా చేరి దేశ సేవ చేయాలని గీతం విద్యార్థులను భారత వాయుసేనకు చెందిన మాస్టర్ వారెంట్ ఆఫీసర్ దీపక్ భరద్వాజ్ ప్రోత్సహించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ‘భారత వైమానిక దళ నియామకం: అభివృద్ధి వాహనం – వృత్తి మార్గదర్శనం’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు.ఐఏఎఫ్ సహకారంతో, గీతం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాయుధ దళాలలో వృత్తి అవకాశాల గురించి విద్యార్థులలో అవగాహన కల్పించారు. పలువురు వాయుసేన అధికారుల బృందంతో వచ్చిన దీపక్ భరద్వాజ్, విద్యార్థుల ప్రయోజనం కోసం భారత వైమానిక దళ సామర్థ్యాలను ప్రదర్శించే ఒక మొబైల్ ఎగ్జిబిషన్, సిములేషన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.

సమావేశాన్ని ఉద్దేశించి దీపక్ భరద్వాజ్ మాట్లాడుతూ, యూపీఎస్సీ, ఏఎఫ్ క్యాట్, ఎన్.సీ.సీ. స్పెషల్ ఎంట్రీ ద్వారా పర్మనెంట్ కమిషన్ లేదా షార్ట్ సర్వీస్ కమిషన్ తో ఐఏఎఫ్ లో చేరవచ్చన్నారు. ఒకసారి ప్రవేశ స్థాయి అధికారిగా చేరాక, వైమానిక దళాధిపతి (చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్) పదవి వరకు ఎదగొచ్చని చెప్పారు. అలాగే ఫ్లయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ విభాగాలతో పాటు, ప్రతి విభాగానికి కావలసిన అర్హతా ప్రమాణాలు, అవసరమైన అర్హతల గురించి కూడా ఆయన విపులంగా తెలియజేశారు.అంతే కాకుండా, ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు (ఐఎఫ్ఎస్బీ) ప్రక్రియను కూడా ఆయన వివరించారు. ఇందులో రాత పరీక్షలు, వ్యక్తిత్వ మదింపు, మానసిక పరీక్షలు, గ్రూపు టాస్క్ లు, ఇంటర్వ్యూలు, వైద్య పరీక్షలు, ప్రతిభ ఆధారిత ఎంపిక వంటి అంశాలు కూడా ఉంటాయన్నారు. శాస్త్రీయ, పారదర్శకమైన ఎంపిక విధానాన్ని ప్రస్ఫుటీకరిస్తూ, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, నిబద్ధతతో సిద్ధం కావాలని ఆయన ప్రోత్సహించారు.
వైమానిక దళ వృత్తి వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, దీపక్ భరద్వాజ్ ఆకర్షణీయమైన జీతభత్యాలు, సదుపాయాలతో కూడిన వసతి, సమగ్ర వైద్య సంరక్షణ, విద్యావకాశాలు, సెలవు ప్రయోజనాలు, బీమా సౌకర్యం, సాహస కార్యకలాపాలు, వృత్తిపరమైన అభివృద్ధి గురించి మాట్లాడారు.భారత వైమానిక దళం పరిణామం, జాతీయ భద్రత, సైనిక లాజిస్టిక్స్, మానవతా సహాయం, విపత్తు సహాయం, క్షతగాత్రుల తరలింపులో దాని కీలక పాత్రలతో పాటు 1965, 1971 ఇండో-పాక్ యుద్ధాల సమయంలో దాని సహకారం గురించి కూడా ఒక అవలోకనాన్ని అందించారు. ఐఏఎఫ్ ఆధునిక యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, గగనతల నిఘా వ్యవస్థలను ఆయన విద్యార్థులకు పరిచయం చేశారు.
తొలుత, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ వేణు కుమార్ నాతి అతిథులకు స్వాగతించి, సత్కరించగా, కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ మహమ్మద్ అక్తర్ ఖాన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు వృత్తి అవగాహన కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. అధ్యాపక బృందం, విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, ఐఏఎఫ్ అధికారులతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
