అన్ని ప్రభుత్వ అనుమతులతో లేఅవుట్ ఏర్పాటుచేసిన అన్యాయంగా 22ఏలో చేర్చారు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి విన్నవించిన కాలనీ వాసులు
బాధితులతో కలిసి కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్
సమస్య పరిష్కారానికి హమీ
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్, శ్రీనగర్ కాలనీలలో 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వ అనుమతులతో లే ఔట్ రూపొందించి ఇల్లు నిర్మించుకొని జీవితాలు కొనసాగిస్తుంటే నేడు 22ఏ పేరుతో కాలనీ మొత్తాన్ని నిషేధిత భూముల జాబితాలో చేర్చడం మూలంగా ప్రజలు ప్రతి రోజు నరకయాతన అనుభవిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి నిషేధిత జాబితా నుండి తొలగించకపోతే ప్రజల నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు.శనివారం సాయంత్రం కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శాంతినగర్, శ్రీనగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల ప్రజలు 22A మూలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం పటాన్చెరు పరిధిలోని శాంతినగర్ కాలనీలోని 593, 595, 596, 563, శ్రీనగర్ కాలనీలోని 426, 428 సర్వే నంబర్లలో 20 ఎకరాల విస్తీర్ణంలో హుడా అనుమతితో వెంచర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 22ఏ పేరుతో ప్రభుత్వ నిషేధిత భూముల జాబితాలో రెండు కాలనీలను చేర్చడం జరిగిందని తెలిపారు. దీని మూలంగా ప్రజలు క్రయవిక్రయలు చేయలేక నరకయాతన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదు చేసిన పరిష్కారం లభించడం లేదని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మూలంగానే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే జిఎంఆర్ విమర్శించారు.
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 50 వేల ఎకరాల భూములు, లే ఔట్లు, అపార్ట్మెంట్లు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆయన తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తీసుకుని వస్తున్నామని తెలిపారు. శాంతినగర్, శ్రీనగర్ కాలనీ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని పోవడంతో పాటు సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. లేని పక్షంలో వేలాది మంది ప్రజలతో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కాలనీ అధ్యక్షులు అంజి రెడ్డి, సంజీవ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కుమార్, పవన్, రాబిన్, విజయ్, సురేందర్ గౌడ్, షకీల్, తదితరులు పాల్గొన్నారు.
