గీతంలో నిర్వహించిన నైపుణ్యోపన్యాసంలో విశదీకరించిన ఎన్ఐటీ ప్రొఫెసర్ ధర్మేంద్ర త్రిపాఠి
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
బయో మెడికల్ పరిశోధనలో మెకానికల్ ఇంజనీరింగ్ కీలక భూమిక పోషిస్తోందని, అలాగే అధునాతన చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇతోధికంగా దోహదపడుతోందని ఎన్ఐటీ-ఉత్తరాఖండ్ ప్రొఫెసర్ ధర్మంద్ర త్రిపాఠి అన్నారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘జీవ వ్యవస్థలలో ద్రవ గతిశీలత విశ్లేషణ’ అనే అంశంపై సోమవారం ఆయన నైపుణ్యోపన్యాసం చేశారు. గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు.తన ఉపన్యాసంలో ప్రొఫెసర్ త్రిపాఠి ద్రవ యంత్రశాస్త్రం, జీవ వ్యవస్థలలో దాని వినియోగంపై సమగ్రమైన అవలోకనాన్ని అందించారు. ద్రవ యంత్రశాస్త్రం యొక్క ప్రాథమిక అంశాలైన ద్రవ స్థిరస్థితి, గతిశాస్త్రం, లామినార్, టర్బులెంట్ ప్రవాహాలు, అంతర్గత ప్రవాహాలు, బహుళ దశల ప్రవాహాలు, స్థిరత్వ సమస్యలు, ద్రవ గతిశాస్త్రంలో ఉపయోగించే సంఖ్యాత్మక, గణన పద్ధతులను ఆయన వివరించారు.

ఈ సమావేశంలో ద్రవాలు, ప్రవాహాల వర్గీకరణ, నాన్-న్యూటోనియన్ ద్రవాలు, రియోలాజికల్ ద్రవ నమూనాలు, నానోఫ్లూయిడ్స్, హైబ్రిడ్ నానోఫ్లూయిడ్స్, పరిమాణ విశ్లేషణ, ద్రవ్యరాశి, ద్రవ్యవేగం, శక్తి యొక్క ప్రాథమిక నిత్యత్వ నియమాల గురించి కూడా ఆయన చర్చించారు. జీవ వ్యవస్థలలోని సంక్లిష్ట శారీరక ప్రవాహాలను నమూనా చేయడానికి ఈ భావనలను ఎలా వినియోగిస్తారో ఆయన విశదీకరించారు.ప్రసరణ, శ్వాసకోశ, జీర్ణ, మూత్ర, పునరుత్పత్తి వ్యవస్థల పనితీరును అర్థం చేసుకోవడంలో ద్రవ గతిశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను ప్రొఫెసర్ త్రిపాఠి వివరించారు. కణిత ప్రేరిత అవరోధాల సమక్షంలో శారీరక ప్రవాహాలను విశ్లేషించడానికి ఉపయోగించే గణిత నమూనాల గురించి ఆయన విపులంగా తెలియజేశారు. అలాగే కణితి వృద్ధి, ప్రసరించే కణితి కణాలు, మెటాస్టాసిస్, క్యాన్సర్ చికిత్సలో ద్రవ యాంత్రిక శాస్త్రం యొక్క పాత్రను చర్చించారు. పెరిస్టాల్టిక్ పంపింగ్, ట్యూమర్ మోడలింగ్, స్ట్రీమ్ లైన్ విశ్లేషణ, నియంత్రణ సమీకరణాలు, జీవ ప్రవాహ ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉపయోగించే విశ్లేషణాత్మక పద్ధతుల వంటి భావనలను కూడా పరిచయం చేశారు.
బయోమెడికల్ పరిశోధనలో మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క అంతర్విభాగ అనువర్తనాలపై ఈ ఉపన్యాసం విలువైన అంతర్దృష్టులను అందించింది. అలాగే వ్యాధి యంత్రాంగాలను అర్థం చేసుకోవడానికి, అధునాతన చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి ద్రవ గతిశాస్త్రం ఎలా దోహదపడుతుందో విడమరచి చెప్పింది.ఈ కార్యక్రమాన్ని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకులు ప్రొఫెసర్ పి.శ్రీనివాస్, ప్రొఫెసర్ చిన్మయ ప్రసాద్ సమన్వయం చేశారు. ఆ విభాగాధిపతి డాక్టర్ జయప్రకాష్ శ్రీవాస్తవ, ప్రొఫెసర్ కె.మారుతి ప్రసాద్, ప్రొఫెసర్ ఎన్. వంశీకృష్ణ, అధ్యాపక బృందం, విద్యార్థుల సమక్షంలో అతిథిని సత్కరించారు.
