మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం :
సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ పరిధిలోని మాక్స్ సొసైటీ రోడ్డు ఆక్రమణ వివాదంపై ఎమ్మెల్సీడా. చిన్నమైల్ అంజిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1999 సంవత్సరంలో బీహెచ్ఈఎల్ రిటైైర్డ్ ఉద్యోగులు ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేసిన ఇండ్ల స్థలాలకు సంబంధించి హెచ్ఎండీఏ అనుమతితో ప్రత్యేకంగా 60 అడుగుల రోడ్డును కేటాయించారు.అయితే, దశాబ్దాల పాటు సజావుగా ఉన్న ఈ మార్గంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత బీహెచ్ఈఎల్ అధికారులు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఫెన్సింగ్ వేయడంతో స్థానికులకు రాకపోకల తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ సమస్యను స్థానిక ప్రజలు ఎమ్మెల్సీ అంజిరెడ్డి దృష్టికి తీసుకురావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ డీసీ ప్రదీప్ కుమార్తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రజల రాకపోకలకు కేటాయించిన రహదారిని ఆక్రమించడం చట్టవిరుద్ధమని, ఇటువంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తక్షణమే రోడ్డు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, రోడ్డు ఆక్రమణకు పాల్పడిన అధికారులపై వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని స్థానికులకు సూచించారు.
