మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
నిజామాబాద్ గ్రూపు ఎన్.సి.సి. కమాండర్ కల్నల్ పి.ఎస్.సింగ్ మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని ఎన్.సి.సి. యూనిట్ ను సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన గీతం ఎన్.సి.సి. క్యాడెట్లతో ముచ్చటించి, వివిధ ఎన్.సి.సి. శిబిరాలలో చురుకుగా పాల్గొనవలసిందిగా వారిని ప్రోత్సహించారు.క్యాడెట్లను ఉద్దేశించి కల్నల్ సింగ్ మాట్లాడుతూ, ఎన్.సి.సి. శిబిరాలలో పాల్గొనడం వ్యక్తిగత అభివృద్ధికి విలువైన అవకాశాలను అందిస్తుందని, అలాగే క్యాడెట్లు తమ ప్రతిభ, నైపుణ్యాలు, నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు.ఈ పర్యటనలో సంగారెడ్డిలోని 33(టి) బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రమేష్ సరియల్ కూడా పాల్గొన్నారు. విద్యార్థి ఎన్.సి.సి. అండర్ ఆఫీసర్ల సహకారంతో, గీతం అసోసియేట్ ఎన్.సి.సి. ఆఫీసర్ లెఫ్టినెంట్ ఎస్. అజయ్ కుమార్ ఈ పర్యటనను సమన్వయం చేశారు.
