మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సీఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ కొల్హాపూర్ (మహారాష్ట్ర)లోని డి వై పాటిల్ వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధన ప్రచురణ నైతికత అనే అంశం నిర్వహించిన ఒకరోజు అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్.డీ.పీ)లో ముఖ్య వక్తగా పాల్గొని, ఉపన్యసించారు. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐఎస్టీఈ) సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆమె సదస్యులకు మార్గదర్శనం చేసినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
నైతిక పరిశోధన, విద్వత్ ప్రచురణల ప్రాముఖ్యతపై డాక్టర్ పర్వేకర్ దృష్టి సారించినట్టు తెలిపారు. పరిశోధన సమగ్రత, ప్రచురణ నైతికత, సాహిత్య చోరీ నివారణ, పీర్ రివ్యూ, బాధ్యతాయుతమైన పరిశోధన ప్రవర్తన, నాణ్యమైన పరిశోధనను ప్రచురించడానికి ఉత్తమ పద్ధతులు వంటి కీలక అంశాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించినట్టు పేర్కొన్నారు.
అధ్యాపక సభ్యులు, పరిశోధనా పండితులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, విద్యా పరిశోధనలో ఉన్నత నైతిక ప్రమాణాలను పాటించడంపై వారు వక్తతో చురుకుగా సంభాషించినట్టు తెలిపారు. ఈ ముఖాముఖి కార్యక్రమం, శాస్త్రీయ ప్రచురణలలో సమగ్రత, పారదర్శకత, జవాబుదారీతనం ప్రాముఖ్యతను నొక్కి చెప్పిందన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సంగ్రామ్ పాటిల్, నిర్వాహక కమిటీతో పాటు అందులో పాల్గొన్న వారందరికీ డాక్టర్ పర్వేకర్ ధన్యవాదాలు తెలియజేసిందన్నారు. ఇటువంటి ఎఫ్.డీ.పీ.లు నైతిక పరిశోధన పద్ధతులను బలోపేతం చేస్తాయని, జ్జాన వినిమయాన్ని ప్రోత్సహిస్తాయని, సహకార అభ్యాసం ద్వారా విద్యా నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని ఆమె అభిప్రాయపడినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
