భవన నిర్మాణ రంగంలో ఇన్సూరెన్స్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల దుర్వినియోగం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

భవన నిర్మాణ రంగంలో ఇన్సూరెన్స్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం ఇస్నాపూర్ భవన నిర్మాణ రంగ కార్మికుల అడ్డా వద్ద కార్మికులతో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇస్నాపూర్, పటాన్ చెరు, బీరంగూడ, గడ్డపోతారం, సంగారెడ్డిలలో భవన నిర్మాణ రంగంలో ప్రతిరోజు వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నట్లు, రోజురోజుకు నిర్మాణరంగం బాగా అభివృద్ధి అవుతుందని, నిర్మాణరంగ కార్మికులకు అమలు చేయవలసిన సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం విస్మరించి, ప్రైవేట్ సంస్థల జేబులు నింపుతున్నదని మండిపడ్డారు.

2009లో ఏర్పడిన భవన నిర్మాణరంగ వెల్ఫేర్ బోర్డులో 2026 వరకు రాష్ట్రంలో 28 లక్షల పైన బోర్డులో నమోదు చేసుకున్న కార్మికుల సంఖ్య ఉందన్నారు. ఇందులో ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకున్న వారి సంఖ్య 16 లక్షలు ఉన్నప్పటికీ వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని విమర్శించారు. సంక్షేమ పథకాల కోసం వెల్ఫేర్ బోర్డులో 54,000 మంది అప్లై చేసుకున్నారని వాటన్నిటిని వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఇస్నాపూర్, పటాన్ చెరు, బీరంగూడ, గడ్డపోతారం ప్రాంతాలలో ఇన్సూరెన్స్ సౌకర్యం కోసం అప్లై చేసుకున్న వారందరికీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అన్ని అడ్డా కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వమే తగినన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, హెల్త్ కార్డులు ఇవ్వాలని, అడ్డా కేంద్రాలలో మంచినీటి సౌకర్యాలు కల్పించాలని, భవన నిర్మాణ కార్మికులు గత 30 – 35 సంవత్సరాలుగా ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇండ్లలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ప్రతి నెల 6 వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల అద్దె చెల్లిస్తున్నారని, అందుకోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిట్కుల్, బచ్చు గూడెం చౌరస్తా, కర్ధనూర్ చౌరస్తాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి, ప్రస్తుతం అసంపూర్తిగానే నిర్మాణం మిగిలిపోయాయన్నారు.

అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే చేయటంతోపాటు,భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు వెంకన్న, కృష్ణ, పెంటయ్య, బాల్ రాజ్ , సాయిలు, అబ్రహం,మధుసూదన్, విట్టల్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *