అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..
పటాన్ చెరుఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :
నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన చేయాలని మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశించారు.శనివారం సాయంత్రం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో ఐదు మున్సిపాలిటీల మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిషనర్లతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు మున్సిపాలిటీలకు 15 కోట్ల రూపాయల చొప్పున 75 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో పాటు టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి కావచ్చిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రతి వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని కోరారు. అతి త్వరలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు స్థానిక పరిశ్రమల యాజమాన్యాలు, బిల్డర్ల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వంద శాతం పన్నులు వసూలు చేయాలని కోరారు.రాష్ట్ర రాజధానికి సమీపంలో ఐదు మున్సిపాలిటీలు ఉండటం మూలంగా శాంతిభద్రతలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుతో పాటు ముఖ్య కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కమిషనర్లను ఆదేశించారు. అభివృద్ధి పనుల రూపకల్పన, నిధుల కేటాయింపులు, ఖర్చుల్లో పూర్తి పారదర్శకత అవలంబించాలని సూచించారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు కుమార్ గౌడ్, జనార్ధన్, సుష్మ, ప్రమీల, సుమలత, కమిషనర్లు దశరథ్, వెంకటరామయ్య, తిరుపతి, అజయ్ రెడ్డి, వెంకట కిషన్, వైస్ చైర్మన్లు సంధ్య గోవర్ధన్ రెడ్డి, మహేందర్ గౌడ్, హరీష్ రెడ్డి, డిఈ వెంకటరమణ, కౌన్సిలర్ అంతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
