మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా ప్రయోజనాల కొరకు మినీ స్టేడియం, పార్కులను ఏర్పాటు చేయాలని, నానాటికీ పెరిగిపోతున్న ప్రభుత్వ రోడ్ల ఆక్రమణలను అడ్డుకోవాలని, అలాగే తీవ్ర గందరగోళంగా మారిన కొత్త ఇండ్ల నంబర్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు , తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆయన మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ వెంకట కిషన్ రావును కలిసి ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ, స్థానిక యువతకు మరియు విద్యార్థులకు క్రీడల్లో రాణించడానికి, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి కనీసం ఒక్క ఆట స్థలం లేదా మినీ స్టేడియం కూడా లేకపోవడం విచారకరమన్నారు. అదేవిధంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు సాయంత్రం వేళల్లో మానసిక ఉల్లాసం కొరకు గడపడానికి, వ్యాయామం చేయడానికి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి వెంటనే పార్కులను ఏర్పాటు చేయాలని కోరారు.మున్సిపాలిటీలో ఇంటి నెంబర్ల సమస్య వల్ల స్థానిక ప్రజలు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, కరెంట్ కనెక్షన్లు మరియు వివిధ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని మండిపడ్డారు. ఈ ఇండ్ల నంబర్ల సమస్యను మున్సిపల్ రెవెన్యూ విభాగం తక్షణమే సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో కొంతమంది వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా ప్రభుత్వ రోడ్లను, ఖాళీ స్థలాలను ఆక్రమించి అక్రమంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల రోడ్లు ఇరుకుగా మారి తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ప్రకారం అధికారులు స్పందించి, తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
