…అడుగడుగునా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జిఎంఆర్ లకు ఘన స్వాగతం పలికిన మహిళలు
…మహిళా దినోత్సవంలో సెల్ఫీల హోరు
….మహిళా లోకం లో జోష్ నింపిన మంత్రి కేటీఆర్ ప్రసంగం
మనవార్తలు ,పటాన్ చెరు:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, డివిజన్లు, మున్సిపాలిటీల నుండి పెద్ద ఎత్తున మహిళలు కార్యక్రమానికి హాజరయ్యారు. జిఎంఆర్ ప్రాంగణం మొత్తం మహిళలతో సందడిగా మారింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సంబరాలు హోరెత్తాయి. ఒకరికొకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, యాదమ్మ దంపతులు గత 20 సంవత్సరాలుగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించే తీరు పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు నియోజకవర్గస్థాయి లోని అన్ని స్థాయిల మహిళా ఉద్యోగులు, మహిళా ప్రజా ప్రతినిధులతో కలిసి క్రీడలు నిర్వహించి, మూడో రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సుమారు 6 వేల మంది మహిళలతో కార్యక్రమాన్ని నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మహిళల పట్ల ఎమ్మెల్యే జీఎంఆర్ కు ఉండే దృక్పథాన్ని ఈ కార్యక్రమాలు ప్రస్ఫుటం చేశాయని వారు సంతోషం వ్యక్తం చేశారు.