కథనం భావోద్వేగంతో అనుసంధానం కావాలి

Telangana

గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా అనుసంధానం కావాలని, ఉమ్మడి అంశాలతో, సులభంగా అర్థమయ్యేలా ఉండాలని అనుభవజ్జురాలైన కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచించారు. అదే సమయంలో వ్యంగ్యం, మితిమీరిన హాస్యం, విమర్శ లేదా సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని విద్యా ఆవిష్కరణ, పురోగతి కేంద్రం (సీఏఐఏ) ఆధ్వర్యంలో అధ్యాపకులలో స్వీయ-అభివృద్ధి, వృత్తిపరమైన భావప్రకటనా నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో బుధవారం ‘సంభాషణ, ప్రభావం’ అనే అంశంపై ఒకరోజు కార్యశాలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సారథ్యం వహించిన జూజర్ తన విస్తృత నైపుణ్యం నుంచి, ఆమె సమర్థవంతమైన నాయకత్వం, భావ ప్రకటనలో వాటి పాత్రను నొక్కి చెబుతూ, ‘నాలుగు ఎం’లు – లక్ష్యం, సభ్యులు, మనస్తత్వం, పద్ధతి – సమర్థవంతమైన నాయకత్వం, సంభాషణలో వీటి పాత్రను వివరించారు.

అభ్యాసం యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతూ, జూజార్ ‘మూడు ఈ’లు – వ్యక్తిత్వ ప్రభావం, శక్తివంతమైన భంగిమలు, అధికారంతో సంబంధం లేకుండా ప్రభావితం చేయడం, కథన శైలులను విడమరచి చెప్పారు. హార్వర్డ్ ప్రొఫెసర్ అమీ కడ్డీ అంతర్దృష్టులను ప్రస్తావిస్తూ, ఆమె అధిక, అల్ప శక్తి భంగిమల ప్రభావాన్ని ప్రదర్శించారు, తద్వారా ‘మనస్సు శరీరాన్ని ప్రభావితం చేస్తుంది, ఆ శరీరం తిరిగి మనస్సును తీర్చిదిద్దుతుంది’ అనే భావనను తెలియజేశారు.సంభాషణలోని అంశాల సాపేక్ష ప్రాముఖ్యతను జూజర్ మరింత వివరిస్తూ, సంక్షిప్త వివరణ (10 శాతం), సహానుభూతి మ్యాపింగ్ (20 శాతం), భావవ్యక్తీకరణ (70 శాతం) ఉంటుందన్నారు. ఈ కార్యశాలలో పాల్గొన్నవారు తమను తాము పరిచయం చేసుకునేటప్పుడు, లేదా సంస్థకు ప్రాతినిధ్యం వహించేటప్పుడు విశ్వసనీయత లేదా నైతికత, భావోద్వేగం, తర్కం లేదా హేతువులను సమర్థవంతంగా ఉపయోగించడంపై మార్గదర్శనం చేశారు.

కథాకథనాన్ని ఒక శక్తివంతమైన సంభాషణ సాధనంగా పరిగణించడం ఈ కార్యశాల ప్రధాన లక్ష్యం. పాత్ర, సందర్భం,సంఘర్షణ, పరిష్కారం, సందేశం వంటి కీలకమైన కథన నిర్మాణాలను జూజర్ వివరించారు. ‘సంఘటన-చర్య-ప్రయోజనం’, ‘నిర్మాణం-భాగస్వామ్యం-విశ్లేషణ’ వంటి ఆచరణాత్మక విధానాలను కూడా ఆమె ప్రవేశపెట్టారు. రవిశంకర్ అయ్యర్ నటించిన వీడియోల ఆధారంగా, ప్రభావవంతమైన కథాకథనం ఎటువంటి ప్రభావాన్ని సృష్టించగలదో ఆమె వివరించారు.ఈ కార్యశాలలో, విద్యాపరమైన ప్రభావం కోసం కథలు చెప్పడంపై ఒక మాస్టర్ క్లాస్ నిర్వహించి, ఉపన్యాసాలు చెప్పే విధానాన్ని మెరుగుపరచడం, తరగతి గదిలో విద్యార్థులను ఆకట్టుకోవడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలలో అధ్యాపకుల ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. విద్యా సంస్థలలో సమర్థవంతంగా సమన్వయం సాధించడానికి, ప్రభావాన్ని చూపడానికి, సహానుభూతిని, వ్యూహాత్మక సాధనాలను ఉపయోగించుకునేలా, కోహెన్-బ్రాడ్ ఫోర్డ్ ప్రభావ నమూనాని కూడా పరిచయం చేశారు.ఈ కార్యక్రమంలో వాస్తవ సంస్థాగత సందర్భాలకు అనుగుణంగా రూపొందించిన ముఖాముఖి చర్చలు, ఆచరణాత్మక దృశ్యాలు, విశ్లేషణాత్మక అభ్యాసాలున్నాయి. ఈ కార్యశాలను సీఏఐఏకు చెందిన మోసెస్ కోటికెలా సమన్వయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *