ఓటర్లకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం

politics Telangana

ఎస్ఐఆర్ పై అప్రమత్తంగా ఉండండి 

ప్రతి ఓటు అత్యంత కీలకము 

బి ఎల్ ఓ ల పనితీరు అద్వాన్నం 

జూలై 12న పటాన్‌చెరులో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన 

ఎస్ ఐ ఆర్, బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ పై అవగాహన సదస్సు 

పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అంశంలో ఓటర్లకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారని  అర్హులైన ఓటరు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బిఆర్ఎస్ పార్టీ తరఫున నియమించబడిన బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి  అర్హులైన ప్రతి ఓటు ఎస్ఐఆర్లో నమోదు చేయించాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్, బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ అంశాలపై బి ఎల్ ఏ లకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 12 న పటాన్‌చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు ముఖ్య అతిథిగా అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సోమవారం ఉదయం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.మినీ ఇండియా గా పేరుందిన పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడం మూలంగా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు నియోజకవర్గంలో నివాసం ఏర్పరచుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని.. వీరి ఓటు హక్కు అంశం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియమించిన బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ తరపున నియమించబడిన బూతు లెవల్ ఏజెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఓటరుకి ఎస్ఐఆర్ పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి.. తమ వివరాలు నమోదు చేయించుకునేలా కృషి చేయాలని సూచించారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో బిఆర్ఎస్ ఓట్లను తొలగించాలన్న కుట్రతో పనిచేస్తున్నాయని ఆరోపించారు.

ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గంలో 70 వేల ఓట్లు తొలగించి ఆమెను ఓడించారని గుర్తు చేశారు.పటాన్‌చెరు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తొమ్మిది డివిజన్లో ఉన్నాయని.. రాబోయే బల్దియా ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలంటే ప్రతి ఓటును రక్షించుకోవాల్సిన ఆవశ్యకత కార్యకర్తలపై ఉందని తెలిపారు.రెండు చోట్ల ఓటు కలిగిన ఓటర్లకు స్థానికంగానే ఓటు ఉంచుకునేలా సూచించాలని కోరారు.ఈ అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 12వ తేదీన పటాన్చెరులో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఏలు భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యే జిఎంఆర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *