బహుళ లక్ష్యాలతో స్పాడెక్స్ మిషన్

Telangana

నైపుణ్యోపన్యాసంలో పేర్కొన్న ఎన్ఆర్ఎస్ సీ పూర్వ డిప్యూటీ డైరెక్టర్ పద్మజ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్ 30న అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పాడెక్స్ మిషన్ బహుళ లక్ష్యాలతో కూడుకున్నదని, భవిష్య పరిశోధనలకు మరింత ఊతమిచ్చేదని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్ సీ) పూర్వ డిప్యూటీ డైరెక్టర్ పద్మజ యలమంచిలి పేర్కొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇస్రో సంచలనాత్మక స్పాడెక్స్ మిషన్ తో సంబంధం ఉన్న అనేక సాంకేతిక సవాళ్లను ఆమె వివరించారు.స్పాడెక్స్ మిషన్ కేవలం ఉపగ్రహ ప్రయోగం మాత్రమే కాదని, స్పేస్ డాకింగ్ ప్రయోగంపై దృష్టి సారించిన సమగ్ర చొరవను సూచిస్తోందని పద్మజ ఉద్ఘాటించారు. పలు స్టార్టప్ లు, విశ్వవిద్యాలయాల సహకారంతో మొత్తం 24 పేలోడ్లతో ఇస్రో చేపట్టిన ఈ మిషన్ విజయవంతమైతే ఉపగ్రహ తనిఖీ, మరమ్మతు, అంతరిక్ష శిథిలాల తొలగింపు, మానవ అంతరిక్ష కార్యక్రమాలు, అంతరిక్ష కేంద్రాల నిర్మాణం, ఫార్మేషన్ ఫ్లయింగ్ తో సహా అనేక క్లిష్టమైన విధులను సులభతరం చేస్తుందన్నారు.

అధునాతన డాకింగ్ మెకానిజమ్స్, సెన్సార్లు, యాక్యుయేటర్లు, ఖచ్చితమైన కక్ష్య నిర్ధారణ అల్గారిథమ్, స్వతంత్ర (అటానమస్) డాకింగ్ అల్గారిథమ్, ఇంటర్-శాటిలైట్ కమ్యూనికేషన్, పవర్ ట్రాన్స్ ఫర్ మెకానిజమ్స్ తో సహా స్పేస్ డాకింగ్ లో చేపట్టే పలు వినూత్న సాంకేతికతలను పద్మజ వివరించారు. అంతరిక్ష వాహక నౌక యొక్క స్వయంప్రతిపత్త డాకింగ్ కోసం రూపొందించబడిన స్వీయ-హోల్డ్ డౌన్ ఫీచర్ తో డ్యూయల్-లివర్ రిజిడైజేషన్ మెకానిజంను కూడా విశదీకరించారు. రెండెజౌస్, డాకింగ్, కాంపోజిట్ కంట్రోల్, అన్ డాకింగ్, నార్మల్ ఫేజ్ ఆపరేషన్ల దశలతో సహా డాకింగ్ టెక్నాలజీ ప్రదర్శనల క్రమాన్ని పద్మజ తెలియజేస్తూ, ఈ ఛేజర్, టార్గెట్ లు రెండేళ్ల పాటు సేవలందించేలా రూపకల్పన చేశారన్నారు. చివరగా విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలను కూడా నివృత్తి చేశారు.

తొలుత, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ అక్తర్ ఖాన్ అతిథిని స్వాగతించి, సత్కరించగా, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఎస్. కిషోర్ కుమార్ వందన సమర్పణ చేశారు. పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *