మనవార్తలు, శేరిలింగంపల్లి :
రాష్ట్ర ముఖ్యమంత్రి కె సీ ఆర్ అసెంబ్లీలో 91 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఇందులో గిరిజన ఖాళీలను 2,399 మాత్రమే చూపడం గిరిజన నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేయడమేనని అఖిల భారత బంజారా సేవ సంఘ్ రంగా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32 శాఖల్లో 22 వేలకు పైగా గిరిజన బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆనాడు ప్రభుత్వ శాఖలు నివేదికలు సమర్పించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13 వేల గిరిజన బ్యాక్లాగ్ పోస్టులు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్నట్టు తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఆందోళన సందర్భంగా చెప్పింది.
వాటిని భర్తీ చేయడంలో ఆంధ్ర పాలకులు మోసం చేశారని మేము అధికారంలోకి రాగానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ తోపాటు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడే కేవలం 2399 ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తున్నట్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించడం గిరిజన నిరుద్యోగులకు తీవ్ర ఆందోళన,నిరాశకు గురిచేసింది. తెలంగాణ గిరిజన ప్రాంతాల్లో వందలాది గిరిజన గూడేలు, తండాలలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు,ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం 6 శాతం నుండి 10శాతానికి రిజర్వేషన్ పెంచకపోవడంతో గత ఎనిమిదేళ్ల కాలంలో గిరిజనులకు రావాల్సిన విద్యా, ఉద్యోగాలతో పాటు రాజకీయరంగంలో తీవ్రంగా నష్టపోయారు. ఇటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్యోగాల భర్తీ ప్రకటన గిరిజనులకు మరింత అన్యాయం చేసేదిగా ఉందని ఆరోపించారు.
రాష్ట్రంలో గత ఉమ్మడి రాష్ట్రం నుండి ఖాళీగా ఉన్న 13వేల గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల తో పాటు జిల్లాల విభజన, శాఖల విభజన, జోనల్ వ్యవస్థ లో ఏర్పడిన గిరిజన ఖాళీ లన్నిటినీ భర్తీ చేసే విధంగా ప్రత్యేక గిరిజన నోటిఫికేషన్ ఇవ్వాలని లేకపోతే అన్ని గిరిజన, విద్యార్థి ,యువజన సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాపిత ఉద్యమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని అన్నారు.