మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని రావి దీప్తి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘వాహనాల ఇంటర్నెట్ లోకి తెలివిగా చొరబడటాన్ని గుర్తించే వ్యవస్థ (స్మార్ట్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్) కోసం సమర్థవంతమైన అభ్యాస-ఆధారిత విధానం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న సీఎస్ఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.హిమబిందు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ దీప్తి పరిశోధన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ (ఐవోవీ) పర్యావరణ వ్యవస్థలో చొరబాటు గుర్తింపు విధానాలను బలోపేతం చేయడానికి రూపొందించిన వినూత్న అభ్యాస-ఆధారిత ఫ్రేమ్ వర్కును అందిస్తుందని తెలిపారు. సైబర్ బెదిరింపులను గుర్తించడానికి, నిరోధించడానికి అధునాతన మెషిన్ లెర్నింగ్ పద్ధతులను అన్వయించడం ద్వారా అనుసంధానించిన వాహన నెట్ వర్కుల భద్రత, విశ్వసనీయత, సామర్థ్యాన్ని పెంచడం ఈ అధ్యయనం లక్ష్యమన్నారు.స్మార్ట్ ట్రాన్స్ పోర్టేషన్ సిస్టమ్ లలో సైబర్ సెక్యూరిటీ యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను ఈ పరిశోధన ప్రముఖంగా ప్రస్తావిస్తోందని తెలిపారు. సురక్షితమైన, మరింత స్థితిస్థాపకంగా ఉండే తెలివైన చలనశీల మౌలిక సదుపాయాలు (మొబిలిటీ ఇన్ ఫ్రాస్టక్చర్లను) నిర్మించడంపై విలువైన అవగాహనను కల్పిస్తుందన్నారు.డాక్టర్ దీప్తి సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలిపినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పరిశోధనలో, వృత్తిపరంగా ఆమె మరిన్ని విజయాలను సాధించాలని వారు అభిలషించారు.
