పటాన్‌చెరు నియోజకవర్గ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన దీక్షలు

Districts politics Telangana

_పటాన్చెరు, రామచంద్రపురం నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

_చివరి గింజ కొనే వరకు జంగ్ కొనసాగిస్తాం

మనవార్తలు,పటాన్‌చెరు:

రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు నిర్వహించారు. రామచంద్రాపురం, పటాన్చెరు లో నిర్వహించిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం పండించిన చివరి ధాన్యం గింజని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు గ్రామస్థాయి నుండి ఢిల్లీ వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రైతాంగానికి మద్దతుగా పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు.

గతంలో పంట మార్పిడి విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తే రాష్ట్ర బిజెపి నాయకులు వరి పంటను సాగు చేయాలని రైతులను రెచ్చగొట్టారని అన్నారు. నేడు పంట కొనుగోలు విషయంలో బిజెపి నాయకులు చేతులెత్తేయడం వాడి ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోందని ఆరోపించారు. ఆరుగాలం కష్టించి పండించిన రైతన్న నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మూలంగా అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వన్ నేషన్- వన్ ప్రోక్యూర్మెంట్ విధానాన్ని వెంటనే దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే వారం రోజుల్లో జాతీయ రహదారి దిగ్బంధం, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *