శ్రీశైలం, మనవార్తలు ప్రతినిధి :
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో గురువారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సుండిపెంట చేరుకున్న లోకేష్ దంపతులు రోడ్డు మార్గం ద్వారా సాక్షి గణపతి ఆలయం చేరుకుని అక్కడ సాక్షి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు,శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు వచ్చిన లోకేష్ దంపతులకు శ్రీశైల దేవస్థానం అధికారులు, అర్చకులు, వేదపండితులు సాంప్రదాయబద్ధంగా ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత లోకేష్ కుటుంబ సభ్యులు శ్రీ స్వామి అమ్మవార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో లోకేష్ కుటుంబ సభ్యులకు అర్చకులు, వేదపండితులు వేదఆశీర్వచనం చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు లోకేష్ కుటుంబ సభ్యులకు స్వామివారి శేష వస్త్రాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, నంద్యాల జిల్లా టిడిపి, జనసెన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలువురు పాల్గొన్నారు.