_యువ శాస్త్రవేత్తలకు అభినందనలు
మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు పట్టణానికి చెందిన యువ శాస్త్రవేత్తలు హ్యూమనాయిడ్ రోబో ఆవిష్కరించడం అభినందనీయమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు కేంద్రంగా పనిచేస్తున్న సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్ మైత్రి పేరుతో హ్యూమనాయిడ్ రోబోను తయారుచేసింది. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా రోబోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అందిస్తున్న ప్రోత్సాహం తో రాష్ట్రంలో యువ శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణలు చేయడం సంతోషకరం అన్నారు.
పటాన్ చెరు నియోజకవర్గం గర్వపడేలా యువ శాస్త్రవేత్తలు ఫణి కుమార్, దుర్గా ప్రసాద్ లు రోబో ని తయారు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, రాంచందర్, షకీల్, యువ శాస్త్రవేత్తలు ఫణి కుమార్, దుర్గా ప్రసాద్ లు పాల్గొన్నారు.
