మూసీ తరహాలో మంజీరా నదిని కూడా రక్షించాలి మెట్టు శ్రీధర్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాద్‌లోని మూసీ నది ప్రక్షాళన మరియు సుందరీకరణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. అదే స్థాయిలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల జీవనాధారమైన మంజీరా నదిని కూడా కాలుష్యం బారినుండి రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు  డిమాండ్ చేశారు.గోదావరి ఉపనది అయిన మంజీరా నది ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్షలాది మంది ప్రజలకు సాగు మరియు తాగునీటి ప్రధాన ఆధారంగా ఉందని తెలిపారు భావితరాలకు సాగు మరియు తాగునీటికి ఉపయోగపడే మంజీరా నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలోని నాలాల ద్వారా వచ్చే మురుగు నీరు మరియు పారిశ్రామిక సంస్థలు విడుదల చేసే రసాయన వ్యర్థాలు నక్కవాగు ద్వారా ఇస్మాయిల్ ఖాన్‌పేట్ పరిసర ప్రాంతాల్లో మంజీరా నదిలో కలుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కలుషిత నీరు చివరకు కామారెడ్డి జిల్లా పరిధిలోని నిజాం సాగర్‌లోకి చేరుతుందని, ఈ పరిస్థితి కొనసాగితే మంజీరా నది భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు.హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, హైదరాబాద్‌కు సమీపంలోనే ఉండి వేలాది ఎకరాలకు సాగునీరు మరియు లక్షలాది ప్రజలకు తాగునీరు అందిస్తున్న మంజీరా నది కాలుష్య సమస్యపై కూడా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

అదేవిధంగా, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం గతంలో పటాన్‌చెరులో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం భవనాలు నిర్మించడం సరిపోదని, కాలుష్య బాధితులకు తక్షణమే పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కుతో పాటు స్వచ్ఛమైన పర్యావరణం పొందే హక్కు కూడా ఉందని గుర్తు చేశారు. అలాగే నీటి కాలుష్య నివారణ చట్టం–1974ను కఠినంగా అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆయన అన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి మూసీ నది తరహాలోనే మంజీరా నది పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, లేదంటే మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడానికి వెనుకాడనని మెట్టు శ్రీధర్ హెచ్చరించారు. మంజీరా నదిని కాలుష్యం బారినుండి రక్షించుకోవడం ప్రభుత్వంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరి బాధ్యత అని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్   పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *