ప్రభుత్వ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోండి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందజేస్తున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు.బుధవారం పటాన్చెరు ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పటాన్చెరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సిడిఎఫ్ ద్వారా మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో పలు గ్రామపంచాయతీలు వెనుకబడి ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సంభందిత గ్రామ సర్పంచులు, పాలకమండలి సభ్యులు, అధికారులు సత్వరమే నిధుల వినియోగానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల వినియోగంలో పటాన్చెరు నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకునే నిరుపేదలకు ప్రభుత్వం త్వరలోనే మూడు లక్షల రూపాయలు అందించనుందని తెలిపారు. దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రవేశ పెట్టిన దళిత బందును సైతం నియోజకవర్గ వ్యాప్తంగా అందించనున్నట్లు తెలిపారు. ఇస్నాపూర్, రుద్రారం ముత్తంగి, చిట్కుల్ తదితర ప్రాంతాల్లో గంజాయి క్రయ విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకుని రాగా, గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి, పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, తహసిల్దార్ పరమేశం, ఎంపీడీవో బన్సీలాల్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *