మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి లీలా ప్రసాద్ కౌతారపు డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘ద్రవ ఔషధ మోతాదు రూపాల నాణ్యతను అంచనా వేయడానికి డిజైన్ ద్వారా నాణ్యత దృష్ట్యా హరిత విశ్లేషణాత్మక పద్ధతి అభివృద్ధి’ చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.రత్నమాల మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ లీలా ప్రసాద్ డాక్టరల్ పరిశోధన, ఔషధ ద్రవ ఫార్ములేషన్ల కోసం సుస్థిరమైన, విశ్వసనీయమైన హరిత క్రోమోటోగ్రాఫిక్ విశ్లేషణాత్మక పద్ధతులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినట్టు తెలియజేశారు. ఈ అధ్యయనం, ఔషధ విశ్లేషణలో పటిష్టత, విశ్వసనీయతను నిర్ధారించడానికి క్వాలిటీ బై డిజైన్ (క్యూబీడీ) సూత్రాలను ఏకీకృతం చేస్తూ, మెరుగైన కచ్చితత్వం, ఎంపిక సామర్థ్యం, సున్నితత్వం, పునరుత్పత్తి సామర్థ్యం ద్వారా విశ్లేషణాత్మక రసాయన శాస్త్రాన్ని ముందుకు తీసుకువెళ్లిందని పేర్కొన్నారు.ఈ పరిశోధన, సెరోటోనిన్ రిసెప్టర్ యాంటాగోనిస్ట్ ఫార్ములేషన్లు, మాస్ట్ సెల్ స్టెబిలైజర్లు, హిస్టమైన్ రిసెప్టర్ యాంటాగోనిస్టులు, లింకోసమైడ్ యాంటీబయాటిక్ ఇంజెక్టబుల్స్ విశ్లేషణలో, యాంటీబయాటిక్ లిక్విడ్ ఫార్ములేషన్లలో క్యాన్సర్ కారక, జన్యు విషపూరిత మలినాలను అతి తక్కువ స్థాయిలో నిర్ధారించడంలో, అలాగే ఫిజియోలాజికల్ ద్రావణాల స్థిరత్వ అధ్యయనాలలో గణనీయమైన తోడ్పాటును అందించినట్టు వివరించారు. ఈ అధ్యయనం, సుస్థిరమైన, వినూత్నమైన ఔషధ విశ్లేషణాత్మక పద్ధతుల దిశగా ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తోందన్నారు.డాక్టర్ లీలా ప్రసాద్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
