చట్టాలపై అవగాహన అవశ్యం…

politics Telangana

– న్యాయ సేవా దినోత్సవ వేడుకల్లో సంగారెడ్డి న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి జె . హనుమంతరావు

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

మనదేశంలోని చట్టాలు , రాజ్యాంగం , న్యాయ వ్యవస్థపై ప్రతి పౌరుడికీ కనీస అవగాహన ఉండాలని , వాటి గురించి అవగాహన లేదనడం సబబు కాదని సంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి , జిల్లా సీనియర్ సివిల్ జడ్జి శ్రీ జె.హనుమంతరావు స్పష్టీకరించారు . ‘ న్యాయ సేవా దినోత్సవం ‘ సందర్భంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ చట్టపరమైన అవగాహన ద్వారా పౌరుల సాధికారత , వారికి చేరువ కావడం దేశ వ్యాప్త ప్రచారం ‘ అనే అంశంపై బుధవారం ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు . బాలలు , మహిళలు , అణగారిన వర్గాలకు ఉన్న హక్కులు , వారి రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పలు చట్టాలు , చట్టపరమైన భద్రతల గురించి జిల్లా న్యాయమూర్తి వివరించారు . ఏదైనా వివాదంలో కోర్టును ఆశ్రయించే వారు , ఒక అవగాహనతో కేసును సత్వరం పరిష్కరించుకోవాలనుకుంటే , పెస్టా ఖర్చు లేకుండా న్యాయ సేవా సాధికార సంస్థ రాజీ కుదురుస్తుందని చెప్పారు . ఉభయ పక్షాల అంగీకారంతో ఒక అవగాహనకు వచ్చేలా చేస్తుందన్నారు .

అవి కుటుంబ వివాదాలు , ఆస్తి తగాదాలు , విడాకుల కేసులు .. ఏవైనా సత్వర పరిష్కారం కోసం ఉభయ పక్షాలు కలిసి ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న న్యాయ సేవా సాధికార సంస్థను ఆశ్రయించవచ్చని హనుమంతరావు చెప్పారు . రాజ్యాంగ రచన , అందులోని అధికరణలు , హక్కులు , బాధ్యతలతో పాటు కేశవానంద భారతి , రూపాలాల్ బజాజ్ వంటి పలు కేసులతో పాటు రెండు రోజుల క్రితం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ( ఈడబ్ల్యూబీ ) రిజర్వేషన్ల గురించి ఆయన విద్యార్థులకు వివరించారు . అలాగే యాంటీ ర్యాగింగ్ చట్టం , 18 ఏళ్ళ లోపు బాలికలు , మహిళలకు ఉన్న ప్రత్యేక హక్కుల గురించి కూడా చెప్పారు . తొలుత , స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్ . సునీల్ కుమార్ జిల్లా న్యాయమూర్తిని ఆహ్వానించగా , స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ వందన సమర్పణ చేశారు . ఇరువురూ ఆయనను ఉచిత రీతిన దుశ్శాలువతో సత్కరించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *