రసాయన శాస్త్రంలో కళ్యాణి మల్లాదికి పీహెచ్.డీ.

Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని కళ్యాణి మల్లాది డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘కొత్త పైరిమిడిన్ ఆధారిత కార్బోసైక్లిక్ న్యూక్లియోసైడ్, ఫ్యూజ్డ్ హెటెరోసైక్లిక్ ఉత్పన్నాలు: సంశ్లేషణ, ఇన్-సిలికో, మధుమేహ నిరోధక, సూక్ష్మక్రిమి నిరోధక మూల్యాంకనం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సిద్ధాంత వ్యాసం, మధుమేహ నిరోధక, సూక్ష్మజీవ నిరోధక అనువర్తనాలకు సంభావ్యత ఉన్న నూతన పిరిమిడిన్-ఆధారిత సమ్మేళనాల అభివృద్ధిని అన్వేషిస్తుందని తెలియజేశారు. ఈ అధ్యయనం అనేక ఆశాజనకమైన α–గ్లూకోసిడేస్ నిరోధకాలను గుర్తించిందన్నారు. వీటిలో ఎంపిక చేసిన సమ్మేళనాలు బలమైన నిరోధక చర్యను, అనుకూలమైన మాలిక్యులర్-డాకింగ్ ప్రొఫైల్స్ ను, గణనీయమైన యాంటీ బాక్టీరియల్ చర్యను, ఆశాజనకమైన డ్రగ్-లైక్ నెస్, ఏడీఎంఈ, టాక్సిసిటీ లక్షణాలను ప్రదర్శించినట్టు తెలిపారు.మధుమేహం, సూక్ష్మజీవుల సంక్రమణలకు సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన చికిత్సా అభ్యర్థుల కోసం జరుగుతున్న అన్వేషణకు ఈ పరిశోధన దోహదపడుతుందని వివరించారు.

డాక్టర్ కళ్యాణి సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, రసాయ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పరిశోధనకు ఆమె చేసి గణనీయమై కృషిని అభినందించినట్టు తెలిపారు. డాక్టరేట్ పరిశోధన అంతటా అంకితభావంతో మార్గనిర్దేశనం చేయడంతో పాటు సలహాలు అందించినందుకు ప్రొఫెసర్ రాంబాబు గుండ్లను కూడా ప్రశంసించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *