గీతంలో వినూత్న మార్గదర్శన కార్యక్రమం

Telangana

విద్యార్థుల సాధికారతే లక్ష్యంగా ప్రారంభించిన టీఎంసీజీ డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

అర్థవంతమైన మార్గదర్శనం, సలహాల ద్వారా విద్యార్థులకు సాధికారత కల్పించే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఒక వినూత్న విద్యార్థి మార్గదర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గీతం వృత్తిపరమైన సలహాల కేంద్రంలోని శిక్షణ, మార్గదర్శకత్వం, వృత్తిపరమైన సలహాలు (టీఎంసీజీ) డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ దీనికోసం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు తమ విద్య, వృత్తి, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ఆందోళనలను పరిష్కరించుకోవడంలో సహాయ పడటానికి ‘టాక్ టైమ్’ పేరుతో ఒక ప్రత్యేకమైన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా, డాక్టర్ మాథ్యూ 2026 మే 11 నుంచి డిసెంబరు 31 మధ్య కాలంలో, ప్రతిరోజూ సాయంత్రం 4.00 నుంచి 5.30 గంటల వరకు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు 15 నిమిషాల చొప్పున వ్యక్తిగత సంభాషణకు (నేరుగా మాట్లాడటం) ఆమె అవకాశం కల్పిస్తున్నారు. శని, ఆదివారాలు మినహా, మిగిలిన అన్ని పనిదినాలలో ఈ సెషన్లు అందుబాటులో ఉంటున్నాయి.నైపుణ్యాభివృద్ధి-పరిశ్రమ సంసిద్ధత, వృత్తి మార్గదర్శనం-మార్గాలు, మార్గదర్శకత్వం-వృత్తిపరమైన అభివృద్ధి, అభిప్రాయాలు-ఆందోళనలకు సంబంధించిన విషయాలను చర్చించడానికి విద్యార్థులకు సౌకర్యవంతమైన, బహిరంగ వేదికను అందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం విద్యార్థులను తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మార్గనిర్దేశం కోరడానికి, సహాయక వాతావరణంలో నిర్మాణాత్మక సలహాలను పొందడాన్ని ప్రోత్సహిస్తోంది.ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని డాక్టర్ రోజీనా మాథ్యూ వివరిస్తూ, విద్యార్థులు తమ ఆలోచనలను బహిరంగంగా పంచుకోవడానికి, ముఖ్యమైన నిర్ణయాలపై స్పష్టత పొందడానికి, వ్యక్తపరచడానికి సంకోచించిన ఆలోచనలను చర్చించడానికి, వారి విద్యా, వృత్తిపరమైన ఎదుగుదలను ప్రభావితం చేసే సవాళ్లపై కొత్త దృక్కోణాలను పొందడానికి వీలుగా నిజమైన, అర్థవంతమైన సంభాషణలను సృష్టించడం ఈ టాక్ టైమ్ కార్యక్రమ ఉద్దేశ్యమని చెప్పారు. స్లాట్ల సంఖ్య పరిమితంగా ఉన్నందున, విద్యార్థులు తమ వంతుగా సమయాన్ని పొందేటప్పుడు స్పష్టమైన చర్చాంశాలతో సిద్ధంగా రావాలని, అవకాశాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని, సార్థకమైన సంభాషణను చేయాలని ఆమె స్పష్టీకరించారు.విద్యార్థులతో తాను పంచుకున్న క్యూఆర్ కోడ్ లేదా వెబ్ లింక్ ద్వారా అపాయింట్ మెంట్లను రిజర్వు చేసుకోవాలని డాక్టర్ రోజీనా సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *