_పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరి మనబడి కార్యక్రమం ద్వారా పటాన్చెరు నియోజకవర్గంలో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మన ఊరు మన బడి ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై మంగళవారం ఉదయం పటాన్చెరు మండల పరిషత్ సమావేశం మందిరంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో మొదటి విడతలో ఎంపికైన 55 పాఠశాలల్లో చేపట్టిన పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే 20 పాఠశాలలో పనులు పూర్తికాగా, మరో 35 పాఠశాలల్లో చివరి దశలో ఉన్నాయని తెలిపారు.
గుమ్మడిదల మండల పరిధిలో 8 పాఠశాలలు, జిన్నారం మండల పరిధిలో 15, అమీన్పూర్ మండల పరిధిలో 8, పటాన్చెరు మండల పరిధిలో 14, రామచంద్రపురం మండల పరిధిలో 10 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. వచ్చేనెల 12వ తేదీ లోపు పనులు పూర్తిచేసి, ఆయా పాఠశాలలకు అప్పగించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిధుల కొరత ఉంటే వెంటనే సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం 100% విజయం సాధించాలంటే సంపూర్ణంగా సహకరించాలని కోరారు.అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనులు మందకోడిగా సాగడంపై సంభందిత కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతో కూడిన మౌలిక వసతులు కల్పించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపీపీ దేవానందం, కార్పొరేటర్లు, మెట్టు కుమార్ యాదవ్ పుష్ప నగేష్, మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, నరసింహా గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.