200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం
ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి
25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం
ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఎంపీ రఘునందన్ రావు కితాబు
నవ సమాజ నిర్దేశకులు గురువులు
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఒక దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుందని అలాంటి గురువులను గత 24 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకల ద్వారా గౌరవించడం అభినందనీయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని అభినందించారు.శనివారం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో పటాన్చెరు నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని కొనియాడారు. విద్యార్థులకు చదువుతోపాటు నైతిక విలువలు, కుటుంబ బంధాలు, సమాజంలో వస్తున్న మార్పులను తెలియజేస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుదర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అధిక శాతం పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలల ద్వారా పోటీ ఏర్పడుతున్నప్పటికీ ప్రైవేటు పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని అభినందించారు. ప్రతి రంగంలో పటాన్చెరు నియోజకవర్గానికి వన్నెతెచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.. ప్రభుత్వ ప్రైవేటు తేడా లేకుండా గత 24 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యఅతిథిగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుండి ప్రారంభమైన తన జీవితం నేడు పార్లమెంటు సభ్యుడు వరకు ఎదగడం వెనక ప్రధాన కారణం.. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులదే అని ప్రశంసించారు. ప్రస్తుత సమాజంలో మొబైల్ వాడకం అత్యంత ప్రమాదకరంగా మారిందని తెలిపారు. టెక్నాలజీని మనిషి ఎదుగుదలకు ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని. అదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే సమాజానికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పదవ తరగతి పిల్లవాడు సైతం తనకు దొరకని వస్తువు కోసం తోటి విద్యార్థిని హత్య చేసే దారుణమైన పరిస్థితులు ఏర్పడడం ఆ విద్యార్థి మానసిక పరిస్థితికి అర్థం పడుతోందని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలోని ప్రతి విద్యార్థి చదువుతోపాటు మానసిక ప్రవర్తన పై ఎప్పటికప్పుడు గమనించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రైవేట్ పాఠశాలల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.