శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
తెలుగు సాంప్రదాయ కళ కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్సిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం గర్వంగా ఉందన్నారు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు. కళలను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కూచిపూడి నృత్యప్రదర్శనలో వారు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 3,782 మంది కళాకారులు ఒక్కసారిగా సామూహికంగా ఏడు నిమిషాలపాటు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించి రికార్డును సొంతం చేసుకున్నారు.
గచ్చిబౌలి స్టేడియానికి కూచిపూడి నృత్య గురువులు, కళాకారులు, విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆదివారం ఉదయం 8 గంటలకే చేరుకొని ప్రదర్శించాల్సిన నృత్యాలను ప్రాక్టీస్ చేశారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తర్వాత మేకప్ వేసుకొని కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు చేపట్టారు. భారత్ ఆర్ట్స్ అకామి వ్యవస్థాపక అధ్యక్షులు రమణారావు, అధ్యక్షులు లలితారావుల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన సాగింది. ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధి రిషిత్ నాథ్ ప్రదర్శనను ప్రత్యక్షంగా చూసి గిన్నిస్ రికార్డు సాధించినట్లుగా స్టేజీపైన ప్రకటించారు. దీంతో కళాకారుల హర్షద్వానాల మధ్య స్టేడియం మారుమోగింది.
కూకట్ పల్లికి చెందిన శ్వేత తన శిష్య బృందంతో కలిసి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. తన దశాబ్దన్నర నృత్య జీవితంలో ఈ రికార్డు మరువలేనిదన్నారు. తన బృందంతో కలిసి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమాన్ని తమ జీవితంలో మరువలేనిదని శ్వేత పేర్కొన్నారు. భారతీయ కళలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని..వాటిని ఆదరించాల్సిన అసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాట్య గురువు పసుమర్తి శేషబాబుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.కళలను ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు. పాఠశాల స్థాయినుంచే పిల్లలకు లలిత కళలను అందించాలని వారు తల్లిదండ్రులకు సూచించారు.