మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
ఆస్టర్ క్వాంటా వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రదీప్ వి.పైదా, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ఏఐ అనలాగ్, ఇంజనీరింగ్ భవిష్యత్తు’ అనే అంశంపై శుక్రవారం విజ్జానదాయకమైన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) విభాగం నిర్వహించింది.ఈ ఉపన్యాసంలో ఏఐ, అనలాగ్ టెక్నాలజీల కలయిక, వీఎల్ఎస్ఐ డిజైన్, సిస్టమ్ ఆవిష్కరణలపై వాటి ప్రభావం, ఇంకా ఇంజనీరింగ్ లో అభివృద్ధి చెందుతున్న పోకడలు, అవకాశాలను విశ్లేషించారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థులను విమర్శనాత్మకంగా ఆలోచించడానికి, ప్రశ్నలు అడగడానికి, ఇంజనీరింగ్ సవాళ్లను పరిష్కరించడానికి ఆచరణాత్మక పద్ధతులను అన్వేషించడానికి ప్రోత్సహించారు.ఏఐ-సిద్ధంగా ఉన్న సెమీకండక్టర్ డిజైన్ పరిసరాలను అభివృద్ధి చేస్తూ, సెమీకండక్టర్ డిజైన్ ను వేగవంతంగా, మరింత సరసమైనదిగా, అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను పైదా వివరించారు. సర్క్యూట్ సిమ్యులేషన్ కు వెళ్లే ముందు, విద్యార్థులు మొదట కాగితంపై సమస్యలను ఊహించుకుని, పరిష్కరించాలని ఆయన సూచించారు. అలాగే స్పెసిఫికేషన్ షీట్లను తెలివైన సర్క్యూట్ డిజైన్లుగా మార్చగల ఏఐ సామర్థ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.విద్యార్థులను లోతుగా ఆలోచించేలా, నిరంతరం నేర్చుకునేలా, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో నైపుణ్యం సాధించేలా ప్రోత్సహిస్తూ, గీతం విద్యార్థులకు ఆస్టర్ క్వాంటా సేవలను, పారిశ్రామిక అవకాశాలను విస్తరించడానికి ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకునేందుకు గల అవకాశాలపై ఆయన ఆసక్తి వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ప్రశాంత ఆర్.ఎం., పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు
