ఎస్‌ఐఆర్ అమలులో లోపాలు సరిదిద్దాలి బీజేపీ సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు బలరాం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం :

కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్) కార్యక్రమం సమర్థవంతంగా అమలు కాకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు, శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం పేర్కొన్నారు.తన నివాసంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ,ఎన్యుమరేషన్ దరఖాస్తులను నింపడం లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రతి బూత్ పరిధిలో 2002 ఓటరు జాబితాలను పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలని సూచించారు. దీంతో ప్రజలు తమ వివరాలను సులభంగా పరిశీలించుకుని దరఖాస్తులను సక్రమంగా నింపుకునే అవకాశం ఉంటుందన్నారు.బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)తో పాటు మరో అధికారిని నియమించి, ఎస్‌ఐఆర్ దరఖాస్తులను ప్రభుత్వ సిబ్బందే నింపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ప్రజలు తెలిసీ తెలియక ఫారాల్లో పొరపాట్లు చేసే అవకాశం ఉందని, అలాంటి తప్పిదాల వల్ల నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల ప్రతి బూత్‌ లో అదనపు అధికారిని నియమించి, ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తులను స్వయంగా ప్రభుత్వ అధికారులు నింపే విధంగా చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాన్ని బలరాం విజ్ఞప్తి చేశారు. దీంతో ఓటర్లకు ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం పారదర్శకంగా, సమర్థవంతంగా అమలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *