పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
– మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
పటాన్ చెరు:
జూలై 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. పట్టణ ప్రగతి సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం 8, 9, 10, 11, 12, 17, 20 వార్డుల పరిధిలో స్థానిక కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులతో కలిసి మున్సిపల్ చైర్మన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తుమ్మల పాండురంగ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత లక్ష్యంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రతి వార్డు పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేయడంతో పాటు వార్డు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాల్లో చర్చిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా నిర్వహించే హరితహారం కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్లు చంద్రకళ గోపాల్, కొల్లూరు మల్లేష్, బాలమణి బాలరాజ్, అనిరుద్ రెడ్డి, నవనీత జగదీష్, మంజుల ప్రమోద్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు తలారి రాములు, యునుస్, డీఈ వెంకటరమణ, ఏఈ శ్రీకాంత్, విద్యుత్ ఏఈ మణికంట, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.