ప్రతి చుక్క.. ఒక ఆశ, ఒక జీవితం

Lifestyle Telangana

గీతంలో రక్తదాన శిబిరం నిర్వహణ

ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

‘ప్రతి రక్తపు బొట్టూ విలువైనదే, ప్రతి దాత మార్పు తీసుకురాగలరు. ఒక చుక్క, ఒక ఆశ, ఒక జీవితం’ అనే స్ఫూర్తిదాయక నినాదంతో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్ సహకారంతో, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పించడం, ఈ కీలకమైన మానవతా కార్యక్రమానికి గీతం సమాజాన్ని సహకరించేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

‘ఈరోజు మీరు ఇచ్చే రక్తదానం కోసం ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉండవచ్చు’ అనే హృదయపూర్వక విజ్జప్తితో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా, గీతం విద్యార్థులు ముందుకొచ్చి, రక్తదానం అనే ఒక చిన్న చర్యను ప్రాణాలను కాపాడటంలో, ఆరోగ్యకరమైన, ఉజ్వల భవిష్యత్తును నిర్మించడంలో ఒక అర్థవంతమైన సహకారంగా మార్చమని ప్రోత్సహించారు.

గీతం హైదరాబాదులోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు సుమారు 170 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. అధ్యాపకులు, సిబ్బంది కూడా ఈ శిబిరంలో చురుకుగా పాల్గొన్నారు. తద్వారా సమాజ సంక్షేమానికి మద్దతు ఇవ్వడంలో, విద్యార్థులలో సామాజిక బాధ్యత సంస్కృతిని ప్రోత్సహించడంలో తమ నిబద్ధతను ప్రదర్శించారు.

రక్తదాన ప్రక్రియను సురక్షితమైన, వ్యవస్థీకృత వాతావరణంలో నిర్వహించారు. దీనివల్ల దాతలు సౌకర్యవంతంగా, బాధ్యతాయుతంగా రక్తదానం చేసేందుకు వీలు కలిగింది. దాతలకు పండ్లు, శీతల పానీయాలను అందించారు. వారి విలువైన సేవకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు.

గీతం నాయకత్వం రక్తదాతలను అభినందించి, రోగులకు, ఆరోగ్య సంరక్షణ సేవలకు సహాయపడటంలో స్వచ్ఛంద రక్తదానం ప్రాముఖ్యతను చాటి చెప్పింది. ఈ శిబిరంలో అధిక సంఖ్యలో పాల్గొనడం గీతం సమాజంలో కరుణ, సేవా స్ఫూర్తిని పునరుద్ఘాటించింది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *