సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో కొల్లూరు, ఉస్మాన్ నగర్, నాగులపల్లి ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి కేటాయించడం జరిగిందని గత కొంతకాలంగా అసాంఘిక శక్తులకు, మత్తు పదార్థాలకు కేంద్రాలుగా తయారవుతున్నాయని వెంటనే చర్యలు చేపట్టడంతో పాటు మత్తు పదార్థాల వినియోగం వల్ల వచ్చే అనర్ధాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.బుధవారం గచ్చిబౌలిలోని సిపి కార్యాలయంలో కమిషనర్ రమేష్ రెడ్డిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా నియోజకవర్గ పరిధిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల డివిజన్లలో గత కొంతకాలంగా మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా యువతతో పాటు విద్యార్థులు, పేద, మధ్యతరగతి ప్రజలు మత్తు పదార్థాలకు బానిసై.. అనారోగ్యానికి గురై ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో అత్యధిక శాతం అత్యంత నిరుపేదలు జీవనం కొనసాగిస్తున్నారని మత్తు పదార్థాల వినియోగం మూలంగా కుటుంబాలు రోడ్డున పడటంతో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో వెంటనే చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉత్పన్నమయ్య పరిస్థితి ఏర్పడబోతున్నాయని సిపి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సిపి రమేష్ రెడ్డి అతి త్వరలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రగ్స్ వాడకం మూలంగా ఎదురయ్యే పరిణామాలను ప్రజలకు స్వయంగా వివరించడం జరుగుతుందని తెలిపారు. నిరంతరం నిఘా పెట్టడంతో పాటు దుష్పరిణామాలపై వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
