పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని తాండ్రిమా మజుందర్ ను డాక్టరేట్ వరించింది. జంతువులలో ఫార్మకోకైనటిక్ అధ్యయనాలకు అనువర్తనాలతో, ఎల్సీ-ఎంఎస్/ఎంఎస్, యూపీఎల్సీ ఉపయోగించి ఎంచుకున్న ఔషధాల బయోఅనలిటికల్ పద్ధతి అభివృద్ధి, ద్రువీకరణపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ మజుందర్ అధ్యయనం ఔషధ విశ్లేషణలో కీలకమైన సవాళ్లను పరిష్కరిస్తుందని, ఔషధ సమ్మేళనాల అంచనాలో ఖచ్చితత్వం, నిర్దిష్టత, సున్నితత్వం, ఖర్చు-ప్రభావిత అవసరాన్ని నొక్కి చెబుతుందన్నారు.
ఆమె పరిశోధన ఎల్సీ-ఎంఎస్/ఎంఎస్ ఉపయోగించి మానవ ప్లాస్మా నుంచి ఆల్పెలిసిబ్, రెమోగ్లిఫ్లోజిన్, మెట్ఫార్మిన్ యొక్క బయోఅనలిటికల్ క్వాంటిఫికేషన్ తో పాటు యూపీఎల్సీ ఉపయోగించి డోరావైరిన్ కోసం స్థిరత్వాన్ని సూచించే పద్ధతిని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఎఫ్.డీ.ఏ., ఐ.సీ.హెచ్. మార్గదర్శకాలకు అనుగుణంగా ధ్రువీకరించిన పద్ధతులు, కుందేలు ప్లాస్మాలోని ఫార్మకోకైనెటిక్ అధ్యయనాలకు విజయవంతంగా వర్తింపజేశామన్నారు. అధిక ఖచ్చితత్వం, ఎంపిక, పునరుద్దరణను ప్రదర్శిస్తాయని, ఇవి ఫార్మకోకైనెటిక్, బయోఈక్వివలెన్స్ అధ్యయనాలకు అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు.
ఈ పద్ధతులు వాటి సరళత, విశ్వసనీయత, పునరుత్పత్తి కారణంగా నాణ్యత నియంత్రణ, నియంత్రణ పరీక్షలలో పారిశ్రామిక వినియోగానికి ఉపకరిస్తాయని తెలిపారు.డాక్టర్ తాండ్రిమా మజుందర్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.డాక్టర్ మజుందర్ విజయం, అత్యాధునిక పరిశోధనలను పెంపొందించడానికి, ఔషధ శాస్త్రాలలో విద్యా నైపుణ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి గీతం అంకితభావాన్ని ప్రస్ఫుటీకరిస్తోందని తెలిపారు.
