మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం :
బంగారం కొనొద్దని, భోజనం మానేయండిన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ వాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తప్పుగా ప్రచారం చేస్తూ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ‘గతంలో కాంగ్రెస్ ప్రధాని గా జవహర్లాల్ నెహ్రూ ఉన్న టైంలో దేశంలో ఆహార కొరత ఉన్నప్పుడు దక్షిణ భారతీయులు అన్నం, ఉత్తర భారతీయులు చపాతీలు తినడం తగ్గించాలని, ఫంక్షన్లకు దూరంగా ఉండాలని సూచించారు. మరో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి హయాంలో దేశ క్షేమం కోసం భారతీయులందరూ వారానికి ఒక పూట భోజనం మానేయాలని ప్రతి సోమవారం ఉపవాసం ఉండాలని పిలుపునిచ్చారు.ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న టైం 1967లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దేశ ప్రజలు బంగారం కొనవద్దని ఆంక్షలు విధించారు. మోదీ కంటే ముందున్న మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్న టైం లో కూడా ఆర్థిక క్రమశిక్షణ పేరుతో సబ్సిడీలును తగ్గించాలని చెప్పలేదా? నెహ్రూ ఆహారం తగ్గించమంటే దేశభక్తి అయినప్పుడు, మోదీ పర్యావరణం కోసం సోలార్ విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు వాడమనడం దేశ శ్రేయస్సు కాదా? నాడు త్యాగాల పేరుతో దేశ ప్రజలకు కష్టాలు మిగిల్చింది కాంగ్రెస్..నేడు ఆర్థిక సంస్కరణల పేరుతో సుస్థిర భవిష్యత్తును నిర్మిస్తోంది మోదీ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం విలాసాలు తగ్గించి, మెట్రో, ఎలక్ట్రిక్ వాహనాల వంటి ప్రజా రవాణాను ప్రోత్సహించడం ఆర్థిక క్రమశిక్షణే తప్ప, ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినా భారత్లో సామాన్యుడిపై భారం పడకుండా మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోంది. వరల్డ్ వైడ్ ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా ఉందంటే అది మోదీ ప్రభుత్వం సాధించిన విజయం, గొప్ప సుస్థిర పాలనకు నిదర్శనం. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నేడు మోదీపై బురదజల్లడం కాంగ్రెస్ నాయకుల ద్వంద్వ నీతికి నిదర్శనం అని అంజిరెడ్డి అన్నారు.
