బీరంగూడ సిద్ధార్థ కాలనీ, ప్రణీత్ కౌంటి మిత్ర విహార్ కాలనీలలో పర్యటన.
4700 గజాలలో నూతన పార్క్ ఏర్పాటుకు హామీ
కాలనీ వాసులతో సమావేశం సమస్యల పరిష్కారానికి హామీ
ఎస్ ఐ ఆర్ లో ప్రతి ఓటరు పాల్గొనాలని విజ్ఞప్తి
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ :
కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని.. సత్వరమే వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయం వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి నియోజకవర్గంలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్ల పరిధిలోని కాలనీలలో నేరుగా ప్రజలతో సమావేశమై వారి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ వాటి పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. తాజాగా శనివారం ఉదయం బీరంగూడ డివిజన్ పరిధిలోని సిద్ధార్థ కాలనీ, ప్రణీత్ కౌంటీ మిత్రవిహార్ కాలనీలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమై.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రీన్ మెడోస్ కాలనీ, మిత్ర విహార కాలనీలలో గల 4745 గజాల స్థలంలో అధునాతన సౌకర్యాలతో పార్కు నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఓపెన్ జిమ్, సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలంటే తప్పనిసరిగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పాల్గొని స్థానికంగానే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. స్వయంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ కాలనీలో పర్యటించి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడం ఇవ్వడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, డిఈ వెంకటరమణ, విద్యుత్ శాఖ ఏడిఈ సంజయ్, మాజీ ప్రజా ప్రతినిధులు కృష్ణ, మల్లేష్, సీనియర్ నాయకులు కృష్ణ, గోపాల్, జగదీష్, తులసి రెడ్డి, శ్రీకాంత్, ఆయా కాలనీల ప్రజలు పాల్గొన్నారు.
