ప్రతి ప్లాట్ యజమానికి సంపూర్ణ న్యాయం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

కొల్లూరు లక్ష్మీపురం ప్లాట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం

నమ్మించి మోసం చేసిన బిల్డర్ పైన కఠిన చర్యలు

అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

ఎవ్వరు అడ్డు వచ్చినా వెనక్కు తగ్గేది లేదు

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం :

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు లక్ష్మీపురం ప్లాట్ల యజమానుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం కొల్లూరులో లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984వ సంవత్సరంలో కొల్లూరు పరిధిలోని సర్వే నంబర్ 173 నుండి 190 పరిధిలోగల 142 ఎకరాలలో భవిష్యత్తు అవసరాల కోసం 1500 ల మంది వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. తదనంతరం కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలతో తిరిగి ప్లాట్లను అమ్మడంతో పాటు. ఇబ్బందులకు గురి చేయడం అన్యాయం అన్నారు. బిఎల్ ప్రసాద్ అనే ప్లాట్ యజమాని సభ్యులందరినీ మోసం చేసి ఫోర్జరీ సంతకాలతో ప్లాట్లను కబ్జా చేసి హెచ్ఎండిఏ అనుమతులతో నిర్మాణాలు కొనసాగించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ తో పాటు, సిటీ ప్లానర్, హెచ్ఎండిఏ ఉన్నత అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లి అనుమతిని రద్దు చేయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. రూపాయి రూపాయి పొదుపు చేసి ప్లాట్లను కొనుగోలు చేస్తే నేడు కొందరు భూ ఆక్రమణదారులు ఇలాంటి చర్యలకు పాల్పడం సిగ్గు చేటని విమర్శించారు. ఈ ఆక్రమణల్లో ఎంతటి పెద్దవారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ప్రతి ఫ్లాట్ యజమానికి పూర్తి న్యాయం దక్కేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతి ప్లాటు సభ్యుడు సమిష్టిగా పోరాటం చేసినప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు నరసింహ, యాదయ్య, వెంకట్రాంరెడ్డి, మధు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *