మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
ఇస్నాపూర్ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26వేల రూపాయలు చెల్లించేలా ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఎం సుమలత శ్రీకాంత్, డిఈ నరసింహారాజు కు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు గత సంవత్సరం నుండి యూనిఫామ్ లు ఇవ్వకుండా సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
ఇస్నాపూర్ మున్సిపల్ ఏర్పాటయి సంవత్సరంనర సమీపిస్తున్న నేటికీ రెయిన్ కోట్ లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇస్నాపూర్ మున్సిపల్ లో అటెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లు, డ్రైవర్లు, శానిటేషన్ విభాగంలో దాదాపు 100 మంది పని చేస్తున్నారన్నారు. వీరందరూ సంక్షేమం కోసం కృషి చేయవలసిన అధికారులు కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. వచ్చే జీతాలు 13600 లతో సరిపోకపోవడంతో మున్సిపల్ వర్కర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాపోయారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో పోలిస్తే వచ్చే వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదని, మున్సిపల్ వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈఎస్ఐ,పీఎఫ్ సౌకర్యాలు ప్రతి కార్మికునికి వర్తింపచేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇస్నాపూర్ మున్సిపల్ లో సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో కార్మికులను ఏకం చేసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బి జయరాం, మున్సిపల్ యూనియన్ నాయకులు మల్లేశం, సంతోష్, రాజు,మానయ్య, బాల్ రాజ్, పోచయ్య, మారుతి, సుదర్శన్, కవిత, తదితర కార్మికులు పాల్గొన్నారు
