మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
ఆషాడ మాసంలో నిర్వహించే బోనాలను పటాన్చెరు పట్టణంలో ఆగస్టు 10వ తేదీ సోమవారం నిర్వహించేందుకు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై బుధవారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో స్థానిక మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన పట్టణ పుర ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఆగస్టు 10వ తేదీన నిర్వహించనున్న బోనాల పండుగ సందర్భంగా అన్ని దేవాలయాల వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య పండుగను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, పట్టణ పుర ప్రముఖులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, పురోహితులు, ప్రజలు పాల్గొన్నారు.
